BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ సర్కార్ మరో గుడ్న్యూస్ చెప్పింది. మంగళవారం తొలి విడతలో భాగంగా రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన ప్రభుత్వం.. బుధవారం మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో కూడా నిధులు జమ చేసినట్టు తెలిపింది. ఈ విడతలో మొత్తం 10.68లక్షల మంది రైతుకు అకౌంట్లో డబ్బులు వేసినట్టు పేర్కొంది.
హైదరాబాద్, జూలై 1: రాష్ట్రంలోని అన్నదాతకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రైతుభరోసా పథకం అమలులో మరో ముందడుగు వేస్తూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండో విడత రైతుభరోసా నిధులను బుధవారం విడుదల చేసింది. 2 నుంచి 3 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1,590.02 కోట్లను జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 10.68 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయం పొందారు. వీరికి చెందిన 26.50 లక్షల ఎకరాల సాగుభూమికి ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతుల ఖాతాల్లో నిధులు నేరుగా జమ కావడంతో సాగు పనులకు అవసరమైన పెట్టుబడి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నిధుల పంపిణీ ప్రక్రియను సులభతరం చేసేందుకు విడతల వారీగా రైతుభరోసా సాయాన్ని విడుదల చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు తొలి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 44.27 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్ల రైతుభరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతలోనే అధిక సంఖ్యలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడతను కూడా పూర్తి చేసింది.
మొదటి, రెండో విడతలను కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలోని 54.96 లక్షల మంది రైతులకు మొత్తం రూ.4,072.04 కోట్ల రైతుభరోసా సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇంకా మిగిలిన అర్హులైన రైతులకు కూడా దశలవారీగా రైతుభరోసా నిధులు జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Breaking News : Rythu Bharosa: అన్నదాతలకు గుడ్న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల.. ఎన్ని ఎకరాల వరకంటే?
01
Jul