ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందని ముందు నేనే చెప్పాను -బండి సంజయ్‌

హైదరాబాద్‌, సిరిసిల్ల కేంద్రంగా ట్యాపింగ్‌ జరిగింది. ప్రభాకర్‌రావు చాలా మంది సంసారాలను నాశనం చేశారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్న పదేళ్లలో ఫోన్‌ మాట్లాడాలంటేనే భయపడేవాళ్లం. ఫేస్‌ టైం, సిగ్నల్‌ యాప్‌లలోనే ఫోన్‌ మాట్లాడుకున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభాకర్‌రావును కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. -బండి సంజయ్‌

సిట్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన నిజాలు
బండి సంజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా ప్రవీణ్‌రావుకు పేరు
బండితోపాటు ఆయన మద్దతుదారులు కూడా లక్ష్యంగా ట్యాపింగ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన బోయినపల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది.

బండి సంజయ్ తరఫున రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రవీణ్ రావు ఫోన్‌ను అధికారులే ట్యాప్ చేసినట్టు సిట్ సమగ్ర దర్యాప్తులో ఆధారాలు బయటపడ్డాయి. మూడు అసెంబ్లీ స్థానాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన ప్రవీణ్ రావు.. బండి సంజయ్‌కు అత్యంత విశ్వసనీయుడు. ప్రస్తుతం ఆయన ఓ కార్పొరేటర్ స్థానం కోసం కూడా ప్రయత్నిస్తున్నారు.

ఈ వ్యవహారంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అయితే ఇప్పుడు సిట్ ఇచ్చిన నివేదికలో ఆయనే కాదు, ఆయన మద్దతుదారులు కూడా టార్గెట్ అయ్యారని స్పష్టమవుతోంది.