*అండమాన్ & నికోబార్ దీవుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన*
*చారిత్రక, వారసత్వ ప్రదేశాలను తిలకించిన కేంద్ర మంత్రి*
BB6 TELUGU NEWS CHANNEL
మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొలిరోజు చారిత్రక ‘‘కాలాపానీ’’ జైలును సందర్శించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం ఈ జైలు. వినాయక్ దామోదర్ సావర్కర్ (వీర సావర్కర్) ను ఏళ్ల తరబడి నిర్బంధించిన జైలు ఇదే కావడం గమనార్హం. అండమాన్ లోని ఈ సెల్యూలర్ జైలును స్వాతంత్ర్యం అనంతరం నేషనల్ మెమోరియల్ గా గుర్తించి ఈ జైలులో కారాగారం అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుల వివరాలను పొందుపర్చారు.
ఇంతటి చారిత్రక నేపథ్యమున్న ఈ అండమాన్ జైలును బండి సంజయ్ కుమార్ సందర్శించడంతోపాటు వీరసావర్కర్ నిర్బంధించబడిన సెల్ ను పరిశీలించారు. దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆయన అందించిన అపూర్వ త్యాగాలు, సేవలను స్మరిస్తూ ఘన నివాళులు అర్పించారు.
అనంతరం కేంద్ర మంత్రి గౌరవార్ధం ఈ సెల్యులర్ జైల్లో సాయంత్రం నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ షోలో భారత స్వాతంత్ర్య సమరయోధుల వీరోచిత పోరాటాలను, ముఖ్యంగా వీర సావర్కర్ జీ జీవితం, త్యాగాలను కళ్లకు కట్టినట్లు చూపించడం విశేషం.
అంతకుముందు బండి సంజయ్ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్ను (మునుపటి రాస్ ఐలాండ్) సందర్శించారు. అక్కడ దీవి చుట్టూ పర్యటిస్తూ వలస పాలన కాలానికి చెందిన చారిత్రక అవశేషాలు, శిథిలాలను పరిశీలించారు. దీవి గొప్ప చారిత్రక వారసత్వాన్ని వీక్షించారు. అనంతరం భారత స్వాతంత్ర్య ఉద్యమంతో సన్నిహితంగా అనుసంధానమై, స్వాతంత్ర్య సమరయోధులు ఎదుర్కొన్న కష్టాలను ప్రతిబింబించే వైపర్ ఐలాండ్ను సందర్శించారు.