BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం పనిచేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. దేశంలోని మహానగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను గమనంలోకి తీసుకుని శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తామని అన్నారు.
✅ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవనంతో పాటు మొత్తం రూ. 1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
✅ అనంతరం మియాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మల్కాజిగిరి పరిధిలోని గాజుల రామారంలో వంద ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మినల్ను నిర్మిస్తామని ప్రకటించారు. వచ్చే 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
✅ హైదరాబాద్ మహానగరంలో మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ కార్యాచరణను వివరించారు.
✅ రాయదుర్గం నుంచి నియోపోలీస్ వరకు మెట్రోను విస్తరణ పనులు చేపడుతామన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా చెప్పుకుంటే సరిపోదని, అందుకు అనుగుణంగా ప్రణాళికలతో అభివృద్ధి జరగాలని చెప్పారు. సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొషన్ భవనాలను ఆధునిక సదుపాయాలతో అత్యంత అద్భుతంగా నిర్మిస్తామని పేర్కొన్నారు.
✅ హైదరాబాద్లో పేదలకు ఇండ్లు కావాలని అడుగుతున్నారని గుర్తుచేస్తూ నగరంలో లక్ష ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను కట్టించి కేటాయించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏ ప్రాంతంలో ఉన్న వారికి అదే ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని, అందుకు అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని తెలిపారు.
✅ దేశంలోని ఢిల్లీ, ముంబయ్, కలకత్తా, బెంగుళూరు, చెన్నై మహానగరాలు కాలుష్యం, వరదలు, ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నాయని వివరించారు. ఈ అయిదు నగరాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ తరాలకు ఏమవసరమో గుర్తించి స్పష్టమైన విజన్తో పనిచేస్తున్నామని చెప్పారు.
✅ “ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం 1.34 కోట్ల జనాభా ఉండగా, ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ మహానగరంలో ప్రతి ఏటా 3 శాతం శరవేగంగా విస్తరిస్తోంది. ఇంతకాలం ఈ ప్రాంతమంతా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్.. ఇలా 4 రకాల పరిపాలన సాగింది.
✅ శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా తాగునీరు, రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, చెత్త పేరుకుపోవడం, కరెంట్, పోలీసు వంటి అనేక సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే నిపుణులతో సమాలోచనలు చేసి 2100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని 3 కార్పొరేషన్లుగా విడదీయాలని నిర్ణయించాం.
✅ 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా వికేంద్రీకరించాం. వీటికి అనుగుణంగానే పోలీస్ కమిషనరేట్లు కూడా ఏర్పాటు చేశాం.
✅ మహానగరం అభివృద్ధి చెందాలని ఈ వికేంద్రీకరణ జరిగింది. అభివృద్ధి విషయంలో రాజకీయ వివక్ష, వితండవాదం లేదు. అభివృద్ధి జరగాలి. ఎన్నికల సమయంలో రాజకీయాలు. ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం. అప్పటివరకు అన్ని పక్షాలు విజ్ఞతతో అభివృద్ధికి సహకరించాలి..” అని ముఖ్యమంత్రి గారు కోరారు.
✅ ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , మండలి ఛీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు , ఎమ్మల్యేలు అరికెపూడి గాంధీ , మల్రెడ్డి రంగారెడ్డి , నవీన్ యాదవ్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం పనిచేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
09
Jun