పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు అధికారులు నిరంతరం నిఘా పర్యవేక్షణ.
పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
పశువుల అక్రమ రవాణాపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలి.
క్షేత్రస్థాయికి వెళ్లి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలి.
రెవిన్యూ,పోలీస్ అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ కిరణ్మయి.
BB6 TELUGU NEWS CHANNEL
పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి అధికారులను ఆదేశించారు.బక్రీద్ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్ కిరణ్మయి అధ్యక్షతన శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధం పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పశువుల అక్రమ రవాణా నిరోధం,జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ కలెక్టర్ సమీక్షించారు.బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలని అన్నారు.గోవధ నిషేధ చట్టం ప్రకారం గోవులను వధించడంపై నిషేధం ఉందని,తెలంగాణాలో ఒంటెలను కూడా వధించకుండా నిషేధం అమలులో ఉందని సూచించారు.ఈ విషయాల పై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తూ, ఎక్కడ కూడా గోవులు, ఒంటెలను వధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.పశువులను తరలించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారిచే ధ్రువీకరణ పొందాలని అన్నారు. బక్రీద్ పండుగ దృష్ట్యా వెటర్నరీ వైద్యులు అన్ని చోట్ల సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు రెవెన్యూ, పోలీస్,రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ జరపాలన్నారు.నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని,క్షేత్రస్థాయికి వెళ్లి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సంయమనంతో వ్యవహరిస్తూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.సీజ్ చేసిన పశువులకు తగిన షెల్టర్ కల్పిస్తూ,వాటికి పశుగ్రాసం, నీటి వసతి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యర్ధాలను ఎక్కడబడితే అక్కడ పారవేయకుండా చూడాలని,వ్యర్ధాలను జనావాసాలకు దూరంగా తరలించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు సూచించారు.సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుక జరిగేలా కృషి చేయాలని అన్నారు.ఈ సమావేశంలో ఆర్డీవోలు జగదీశ్వర్ రెడ్డి అనంత్ రెడ్డి, సరిత, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ అధికారులు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు…