BB6 TELUGU NEWS CHANNEL
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనితో పాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టులవిషయంలో కూడా భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు.
ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఎంసీఆర్హెచ్ఐర్డీలో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా కీలకమైన సూచనలు చేశారు.
జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలోజాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని
తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు ,వాకిటి శ్రీహరి , ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి ,మధుసూదన్ రెడ్డి , మేఘా రెడ్డి , రాజేష్ రెడ్డి ,వంశీకృష్ణ , వీర్లపల్లి శంకరయ్య , బండ్లకృష్ణమోహన్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పాల్గొన్నారు.
