BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఈనెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే.. ‘ముగ్గురు పిల్లల’ నిబంధన మళ్లీ అభ్యర్థులను వెంటాడుతోంది. ఈ నిబంధన నుంచి కొందరికి మినహాయింపులు ఉన్నాయి. అసలు ఈ నిబంధన ఏంటి? ఎవరికి మినహాయింపు ? తదితర వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నారు. ముందుగా రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత మూడు విడుతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 9 నుంచి నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా.. నవంబర్ 11తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈసారి కూడా ‘ముగ్గురు పిల్లల’ నిబంధన వెంటాడుతోంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం.. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉన్న అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించబడతారు.
ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తొలగించినప్పటికీ.. తెలంగాణలో మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఈ నిబంధన కారణంగా గత ఎన్నికల్లో చాలా మంది పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. అయితే కొందరికి ఈ ముగ్గురు పిల్లల నిబంధన నుంచి ప్రత్యేక మినహాయింపు ఉంది. అలాంటి వారు ముగ్గురు పిల్లలు ఉన్నా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగానే పరిగణిస్తారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
31.5.1995 కంటే ముందు ముగ్గురు పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈ తేదీ నాటికి ఇద్దరు పిల్లలుండి, తర్వాత మరో సంతానం కలిగితే మాత్రం వారు పోటీకి అనర్హులు.
31.5.1995కు ముందు ఒక సంతానం కలిగిన తర్వాత కాన్పులో కవల పిల్లలు జన్మిస్తే పోటీకి అర్హులు. (ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు) ఇదే తేదీకి ముందు కవలలు జన్మించి తర్వాత కాన్పులో ఒకరు జన్మిస్తే మాత్రం అలాంటి వారు పోటీకి అనర్హులు.
1.6.1995 తర్వాత మొదటి కాన్పులో ఒకరు, రెండో కాన్పులో కవలలు జన్మిస్తే అలాంటి వారు కూడా పోటీకి అర్హులే.
1.6.1995 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించినా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
1.6.1995 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఇద్దరు పిల్లలున్న వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు.
ముగ్గురు పిల్లలు పుట్టినా నామినేషన్ పరిశీలనకు ముందే వారిలో ఒకరు చనిపోతే జీవించి ఉన్న పిల్లల లెక్కను పరిగణనలోకి తీసుకుని ఆయా అభ్యర్థులను అర్హులుగా పరిగణిస్తారు.
నామినేషన్ పరిశీలన రోజుకు అభ్యర్థి ఇద్దరు పిల్లలు కలిగి.. మళ్లీ గర్భం దాల్చిన మహిళ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హురాలే. (జీవించి ఉన్న పిల్లలను మాత్రమే పరిగణిస్తారు).
ఇలా కొందరికి మాత్రం ప్రత్యేక సందర్భాల్లో ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులుగానే పరిగణిస్తారు.
తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలు.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే, నిబంధనలు ఇవే..!
08
Oct