ఏసీబీ మెరుపు దాడిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తహసీల్దార్

BB6 TELUGU NEWS CHANNEL
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. లంచం డిమాండ్ చేసిన గుడిబండ తహసీల్దార్ కె.శ్రీధర్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. గుడిబండ ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన మెరుపు దాడిలో తహసీల్దార్ శ్రీధర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రైతునుంచి రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకోవడం ఈ ఘటనకు ప్రధాన కారణమైంది.

వివరాల ప్రకారం, ఒక భూ సంబంధిత పనిని పూర్తి చేయించుకోవడానికి బాధిత రైతు తహసీల్దార్ను సంప్రదించాడు.అయితే, ఆ పని చేయాలంటే రూ. 20 వేల లంచం ఇవ్వాలని తహసీల్దార్ శ్రీధర్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ముందుగా పథకం రచించి, పక్కా వ్యూహంతో ట్రాప్ ఏర్పాటు చేశారు.

మంగళవారం నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం రైతు లంచం మొత్తాన్ని తహసీల్దార్ కు అందజేస్తుండగా, అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి శ్రీధర్ ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 20 వేల నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.

అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో గుడిబండ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు, రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని జరిగిన పరిణామాలపై చర్చించుకున్నారు.

రెవెన్యూ శాఖలో అవినీతి ఇంకా కొనసాగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ముఖ్యంగా, తహసీల్దార్ శ్రీధర్ గతంలో కూడా అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కు గురైన విషయం వెలుగులోకి రావడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.

ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ తిరిగి అదే విధంగా అవినీతికి పాల్పడటం అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేలా ఉంది. జిల్లాలోని రెవెన్యూ శాఖలో అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సాధారణ ప్రజలు తమ పనులు చేయించుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి కొనసాగడం దురదృష్టకరమని అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అడిగితే వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు దారులవివరాలు గోప్యంగా ఉంచ బడతాయని, అవినీతి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు.

ఈ ఘటనతో జిల్లాలో మరోసారి అవినీతి అంశం హాటాపిక్గా మారింది. అధికారులు ఇలాంటి కేసులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe