మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షం
జనగణనలో ఓబీసీ గణన చేసి దానికి అనుగుణంగా మహిళా కోటాలో ఓబీసీలకు సబ్ కోటా కల్పించాలి
జాగృతి పోరాటాలతోనే మహిళా బిల్లు కార్యరూపం దాల్చుతోంది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
BB6 TELUGU NEWS CHANNEL
మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ బిల్లు అమలులో 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకుంటామని చెప్పటం మహిళా లోకాన్ని మోసం చేయటమేనన్నారు. మహిళా కోటాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గురువారం ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం చేపట్టే జనగణనలో ఓబీసీ గణన చేయాలని డిమాండ్ చేశారు. జనగణన లో కులం కాలమ్ ఉన్నా వాళ్లు ఓబీసీలకు చెందుతారు అనే క్లాసిఫికేషన్ లేదన్నారు. దీంతో బీసీల జనాభా ఎంత అనే లెక్క తేలదన్నారు. జనగణన లో ఓబీసీలను లెక్కించి ఆ తర్వాతే మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కోటా విషయంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై పోరాటానికి బీసీ మహిళలంతా సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు.
డ్రాఫ్ట్ బిల్లు ముందే ఇవ్వాలి
మహిళ రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశాలకు ముందే డ్రాప్ట్ బిల్లును అన్ని పార్టీలకు ఇవ్వాలని కవిత కోరారు. లేదంటే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదన్నారు. బిల్లుపై చర్చ జరిగే రోజు ఉదయమే సభ్యులకు బిల్లు పత్రులను ఇస్తామని చెప్పటమంటే కచ్చితంగా ఇది అన్యాయం చేసే కుట్రనని మండిపడ్డారు. డ్రాఫ్ట్ బిల్లును ముందే ఇచ్చే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దేశంలోని జాతీయ పార్టీల నేతలతో మాట్లాడతానని కవిత చెప్పారు. పార్లమెంట్ లో మహిళ బిల్లు విషయంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ మహిళలకు న్యాయం చేసే విధంగా అన్ని పార్టీలు ఒక్కటవ్వాలని కోరారు.
మహిళ బిల్లు రావటంలో జాగృతిదే కీలక పాత్ర
దేశంలో మహిళ రిజర్వేషన్ల బిల్లు రావటంలో జాగృతి ది కీలక పాత్ర ఉందని కవిత చెప్పారు. ఈ బిల్లు కోసం ఢిల్లీలో దీక్ష చేసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. దేశంలోని 18 పార్టీలను ఏకం చేసి బిల్లు కోసం పోరాటం చేసే విధంగా కో ఆర్డినేట్ చేశామన్నారు. ఢిల్లీలో తాను చేసిన దీక్ష చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు ఢిల్లీకి వచ్చి పోరాటం చేశారని చెప్పారు. మహిళ బిల్లు కోసం జాగృతి వెలిగించిన దీపం ద్వారా దేశంలోని 29 రాష్ట్రాల మహిళలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.