సర్పంచ్ అభ్యర్థులకు అలెర్ట్.. 45 రోజుల గడువు.. ఆ పని చేయకపోతే.. పదవి ఊడుతుంది

BB6 TELUGU NEWS CHANNEL
TG Sarpanch Polls Candidates Expense Details: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలిచింది. కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కీలక హెచ్చరిక! 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వకపోతే పదవులు కోల్పోవడమే కాకుండా, మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. కనుక అభ్యర్థులు వెంటనే ఎంపీడీవోలకు వివరాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించగా.. అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. డిసెంబర్ 22, సోమవారం నాడు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ అభ్యర్థులకు కీలక అలర్ట్ జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు.. 45 రోజుల్లోగా తమ ఖర్చు వివరాలను వెల్లడించాలని స్పష్టం చేశారు. లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవని.. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హెచ్చరించింది.

మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. సరైన వివరాలు ఇవ్వని అభ్యర్థులు తమ పదవులను కోల్పోతారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ కార్యదర్శి మకరంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ఖర్చుల వివరాలను ఎంపీడీవోలకు సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత ఆ వివరాలను టీఈ-పోల్‌ (TE-Poll) వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అభ్యర్థులను ఆదేశించారు. ఈ నివేదికలను 2026, ఫిబ్రవరి 15లోపు ఎస్‌ఈసీకి పంపాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల ప్రకారం.. గడువులోగా వివరాలు ఇవ్వనివారు, తప్పుడు సమాచారం అందించినవారు తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్ 23 ప్రకారం తమ పదవులను కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. అది మాత్రమే కాకుండా, మరో మూడేళ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయకుండా నిషేధానికి గురవుతారని తెలిపింది.

ఎస్‌ఈసీ నిబంధనల ప్రకారం, 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో. సర్పంచ్‌‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు ఖర్చు చేయవచ్చు. అదే వార్డు మెంబర్‌గా పోటీ చేసే అభ్యర్థి అయితే రూ.30,000 వరకు ఖర్చు చేయవచ్చు. 5వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థి గరిష్ఠంగా రూ.2,50,000 వరకు.. వార్డు సభ్యుల అభ్యర్థి రూ.50,000 వరకు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది

ఇదిలా ఉంటే రాష్ట్రంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలివిడత ఎన్నికల్లో పాల్గొన్నవారు 2026, జనవరి 24 లోపు, రెండో విడతలో పాల్గొన్నవారు జనవరి 27న, మూడో విడతలో పాల్గొన్నవారు జనవరి 30 లోపు తమ ఖర్చుల వివరాలను ఎంపీడీవోలకు సమర్పించాలి.

ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలువురు సిబ్బంది విధి నిర్వహణలో ఉండగానే కన్ను మూశారు. ఇలా విధుల్లో మరణించిన ఉద్యోగుల పట్ల ఎస్ఈసీ కమిషనర్‌ రాణి కుముదిని సంతాపం తెలిపారు.

తెలంగాణలో మొత్తం మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో..1,205 సర్పంచ్‌, 25,848 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోగా మిగిలిన 11,497 సర్పంచు, 85,955 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 1,25,23,137 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్‌ శాతం 85.30గా నమోదైందని ఎస్‌ఈసీ వెల్లడించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe