BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో గురుకులాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఏఐ కోర్సులు ప్రవేశపెట్టాలని గురుకుల విద్యాలయ సంస్థ నిర్ణయించింది. విద్యార్థులకు పోటీ పరీక్షల కోచింగ్ కోసం 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను తీసుకురావాలని అనుకుంటోంది.
తెలంగాణలోని నిరుపేద, వెనకబడిన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మూడోవ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పలు విప్లవాత్మక సంస్కరణలకు ఆమోదం తెలిపారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, గురుకుల డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) కోర్సులను ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు కూడా గ్లోబల్ టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ఉపాధి అవకాశాలను దక్కించుకునే వీలుంటుంది. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని.. గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఏఐ కోర్సులను ప్రవేశపెట్టాలని గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయం తీసుకున్నది.
గురుకులాల్లో విద్యాబోధన నాణ్యతను మరింత పెంచేందుకు అధ్యాపకులకు పెద్దపీట వేశారు. సొసైటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల ఫ్యాకల్టీకి యూజీసీ వేతన శ్రేణులను వర్తింపజేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అధ్యాపక సిబ్బందికి భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరడమే కాకుండా, వారిలో మరింత ఉత్సాహంతో బోధించే నైపుణ్యం పెరుగుతుంది.
ఐఐటీ, నిట్, నీట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా అత్యుత్తమ కోచింగ్ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అదనంగా 9 కొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సెంటర్లతోపాటు ఇవి కూడా అందుబాటులోకి వస్తే మరికొంత మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత కోచింగ్ లభిస్తుంది.
విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపుదల, గురుకుల భవనాల ఆధునికీకరణ, డిజిటల్ క్లాస్రూమ్ల ఏర్పాటుపై కూడా మంత్రి సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ విద్యా, సంక్షేమ సంస్కరణల ద్వారా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు దేశంలోనే సరికొత్త మైలురాయిని సృష్టించబోతున్నాయి. ఈ విప్లవాత్మక నిర్ణయాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం, డిగ్రీ కాలేజీ నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటుతోపాటుగా న్యాక్ గుర్తింపు సాధించేందుకు స్పెషల్ కమిటీని నియమించనున్నారు. 133 గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తుండగా.. శాశ్వత భవనాలను నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాలని తీర్మానం చేశారు. హైదరాబాద్లో ఫార్మసీ కాలేజీ ఏర్పాటుకు టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ బోర్డు ఆమోదం తెలిపింది.
తెలంగాణ గురుకులాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు.., విద్యార్థులకు ల్యాప్టాప్లు!
12
Jun