అరుణోదయ కార్యక్రమంలో భాగంగా యూనిస్ లింక్ సహకారం
BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాష్ట్రంలో దృష్టిలోపం ఉన్న పిల్లల విద్యా భివృద్ధికి “ఎక్ కదమ్ ఔర్ ఫౌండేషన్” కీలకంగా పని చేస్తోంది. ఈ ఫౌండేషన్ అమలు చేస్తున్న అరుణోదయ కార్యక్రమం ద్వారా గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన దృష్టిలోపం ఉన్న పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 29 డిసెంబర్ 2025 నాడు వికారాబాద్ జిల్లాలో దృష్టిలోపం ఉన్న పిల్లలకు స్మార్ట్ఫోన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనిస్ లింక్ డోనర్ టీమ్ ఆర్థిక సహకారం అందించింది. ఈ పంపిణీ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ , ప్రతీక్ జైన్,డి ఆర్ డి ఓ, సీఈఓ ఎ. శ్రీనివాస్, ఏ డి డి, డి ఆర్ డి ఓ, కె. నరసింహులు, ప్రతినిధులు, దృష్టిలోపం ఉన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు మరియు అరుణోదయ ఎడ్యుకేటర్ సురేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దృష్టిలోపం ఉన్న పిల్లలకు విద్య ఎంత ముఖ్యమో వివరించారు. సరైన సహాయం, శిక్షణ లభిస్తే ఈ పిల్లలు కూడా స్వతంత్రంగా ఎదగగలరని తెలిపారు.
డి ఆర్ డి ఓ ప్రతినిధులు కూడా మాట్లాడుతూ.. దృష్టిలోపం ఉన్న పిల్లల కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నందుకు “ఎక్ కదమ్ ఔర్ ఫౌండేషన్” యూనిస్ లింక్ టీమ్ను వారు అభి నందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధరణి. పల్లవి. నిత్య శ్రీ.అక్షిత. సాగర్ అనే దృష్టిలోపం ఉన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు అందజేశారు. ఈ ఫోన్ల ద్వారా పిల్లలు టాల్క్ బ్యాక్ వంటి యాక్సెసి బిలిటీ ఫీచర్లను ఉపయోగించి చదువు కొనసాగించడంతో పాటు డిజిటల్ నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు.
అరుణోదయ కార్యక్రమం ద్వారా దృష్టిలోపం ఉన్న పిల్లలకు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం, దైనందిన జీవన నైపుణ్యాలతో పాటు డిజిటల్ అక్షరాస్యతపై కూడా శిక్షణ ఇస్తున్నారు. దీని వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని తల్లిదండ్రులు తెలిపారు. దృష్టిలోపం ఉన్న పిల్లల జీవితాల్లో వెలుగు నింపే ఈ అరుణోదయ కార్యక్రమం తెలంగాణలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని పలువురు అభిప్రాయ పడ్డారు.
