ఆ పంచాయతీలో ఎన్నికలు నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు.. కారణం ఏమిటంటే..?

BB6 TELUGU NEWS CHANNEL
TG High Court Order Panchayat Election: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందో లేదో.. హైకోర్టుల్లో పిటిషన్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వరంగల్ జిల్లా మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఆరుగురు ఎస్టీ జనాభా ఉన్న గ్రామంలో వారికి సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులు రిజర్వ్ చేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈక్రమంలో ఎన్నికను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గురువారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక తొలిరోజు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో సర్పంచి పదవులకు 3,242 నామినేషన్లు, వార్డు పదవులకు 1,821 నామినేషన్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోరుకు రంగం రెడీ కాగా.. తాజాగా వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ.. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్‌ జిల్లాలోని కేసముద్రం మండలంలో ఉన్న మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ.. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కారణం.. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈ గ్రామాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అయితే ఈ గ్రామంలో వారి జనాభా కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. అలాంటిది వారికి సర్పంచ్ పదవితో పాటు.. మూడు వార్డులను కేటాయించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఈ కేటాయింపులను తప్పు పట్టింది.

2025 ఓటర్ల జాబితా ప్రకారం కాకుండా.. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు కేటాయించడం సరికాదంది. దీనిపై సమర్పించిన వినతిపత్రాలపై నిర్ణయం తీసుకునేవరకు మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలోని మహమూద్‌పట్నం సర్పంచి పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే మిట్టగడువుల యాకూబ్ అనే వ్యక్తి దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ టి.మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. 2025 ఓటర్ల జాబితా ప్రకారం మహమూద్‌పట్నం గ్రామంలో 576 మంది ఓటర్లున్నారని తెలిపారు. వీరిలో ఎస్టీలు ఉన్నది కేవలం ఆరుగురు మాత్రమే అన్నారు.

అలాంటిది తాజా సర్పంచ్ ఎన్నికల్లో వీరికి సర్పంచి పదవితో పాటు మరో 3 వార్డులను రిజర్వ్ చేశారని తెలిపారు. కేవలం ఆరుగురు జనాభా మాత్రమే ఉన్న సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇవ్వడం సరికాదంటూ తాము వినతిపత్రాలు సమర్పించినా.. దీనిపై చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ వాదనలు విన్న కోర్టు.. వినతిపత్రాలపై చర్యలు తీసుకునేదాకా.. మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది. వీటితోపాటు సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్‌లను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించిన వివాదం.. ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో పెండింగ్‌లో ఉందని.. అందుకే తాము దీనిపై ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe