BB6 TELUGU NEWS CHANNEL
Minister Adluri Laxman 6 Guarantees: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన రెండు గ్యారెంటీలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రూ.4 వేల పింఛన్, యువ వికాస పథకం అమలుపై ఆయన స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే నేతలు సైతం.. కుటుంబంతో కలిసి పండుగను జరుపుకుంటున్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరింత సంతోషంగా ఉండాలని.. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ క్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు శుభవార్త చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లే.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని.. ఇప్పటి వరకు నాలుగు గ్యారెంటీలను అమలు చేసిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. మిగతా రెండు హామీలను కూడా త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా తనపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకున్నారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారెంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
మిగిలిన రెండు గ్యారెంటీలైన రాజీవ్ యువ వికాసంతో పాటుగా.. పింఛన్ మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచే హామీని కూడా అతి త్వరలోనే అమలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. గత బీఆర్ఎస్ అసమర్థ పాలన కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిందని తెలిపారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెలా రేషన్ కార్డు మీద సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.
ఆరు గ్యారెంటీలు ఇవే..
మహాలక్ష్మి పథకం:
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల రూ. 2,500 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఇది ఇంకా అమలు కావాల్సి ఉంది. అయితే ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
రైతు భరోసా:
ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎకరానికి రూ. 12,000 సాయం అందిస్తోంది. వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తున్నారు.
గృహ జ్యోతి:
ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు:
ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇళ్ల స్థలం కేటాయింపు కూడా చేస్తోంది.
యువ వికాసం:
విద్యార్థులకు, నిరుద్యోగులకు రూ. 5 లక్షల సాయం చేయనుంది. ఇది ఇంకా అమలు కావాల్సి ఉంది.
చేయూత పథకం:
పింఛను మొత్తాన్ని రూ. 4,000 కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇది ఇంకా పెంచాల్సి ఉంది.
మహిళలకు నెలకు రూ.2500, రాజీవ్ యువ వికాసం, రూ.4000 పింఛన్పై కీలక ప్రకటన
16
Jan