BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన 15 లక్షల మందికి సంక్రాంతిలోపు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రేషన్ కార్డు లేని వారు ఆధార్ లేదా ఓటర్ కార్డు చూపించి కూడా ఈ చీరలను పొందవచ్చు. పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి పంపిణీ ప్రారంభం కానుంది. ‘ఇందిరా మహిళా శక్తి’ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, కోటి మందికి చీరలు అందజేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా మంత్రి సీతక్క తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద మహిళకు ‘ఇందిరమ్మ చీరలు’ (Indiramma Sarees) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చీరలు అందని దాదాపు 15 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఈ చీరలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా మహిళలకు వీటిని అందజేశారు. మధ్యలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాయిదా పడగా.. మళ్లీ చీరల పంపిణీని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
అర్హులైన ప్రతీ మహిళకు చీరలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే.. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండగా.. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా చీరలను అందజేస్తున్నారు. ఒకవేళ ఆధార్, రేషన్ కార్డులు రెండూ లేకపోయినా.. బిలో పావర్టీ లైన్ (BPL) కిందకు వచ్చే పేద మహిళలు తమ ఓటర్ కార్డును చూపించి చీరలను తీసుకోవచ్చు. సదరు గ్రామానికి చెందిన మహిళగా గుర్తింపు ఉండి, అర్హత కలిగి ఉంటే చాలు.. ఎటువంటి సాంకేతిక కారణాలతో పంపిణీ ఆగిపోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మార్చి 1 నుంచి పట్టణాల్లో పంపిణీ..
గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో.. ప్రభుత్వం పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించింది. పట్టణాల్లోని సుమారు 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఈ పంపిణీని చేపట్టనున్నారు.
మహిళలను కేవలం లబ్ధిదారులుగా చూడకుండా.. వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 250 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. వీరికి వంటలు, నిర్వహణలో శిక్షణ కూడా ఇచ్చారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం వద్ద మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక దుకాణాల ఏర్పాటు జరుగుతోంది.
మేడారం జాతర సందర్భంగా 500 చికెన్ షాపులు, బొంగు చికెన్ స్టాల్స్ నిర్వహించే బాధ్యతను మహిళలకే అప్పగించారు. ప్రతి మండల సమాఖ్యకు సొంత బస్సులను అందించే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది. ప్రజా ప్రభుత్వం మహిళా పక్షపాతంగా వ్యవహరిస్తూ.. సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తోంది. కేవలం వస్తువుల పంపిణీకే పరిమితం కాకుండా.. బ్యాంకు రుణాల ద్వారా మహిళా సంఘాలు సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా తోడ్పాటు అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
మళ్లీ ఇందిరమ్మ చీరల పంపిణీ షురూ.. ఆధార్ కార్డు ఉంటే చాలు.
06
Jan