BB6 TELUGU NEWS CHANNEL
కామారెడ్డి శివారులోని గర్గుల్ గ్రామ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న జీవన్రెడ్డి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాలం మారుతున్న కొద్దీ, మనిషికి అన్నీ ఉంటున్నా.. మనసుకు ప్రశాంతత మాత్రం కరువవుతోంది. చిన్న చిన్న కుటుంబ సమస్యలకే జీవితాలను అంతం చేసుకునే ఘోరాలు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి. ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ.. సమాజానికి సేవ చేసే వ్యక్తులు సైతం.. తమ వ్యక్తిగత కష్టాల ముందు నిస్సత్తువతో కుప్పకూలిపోతున్నారు. అలాంటి గుండెల్ని పిండేసే ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది.
విధులు నిర్వర్తించే చోటే విషాదం..
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న జీవన్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కామారెడ్డి శివారులోని గర్గుల్ గ్రామ సమీపంలోజీవన్ రెడ్డి తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో అక్కడివారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రాథమిక విచారణలో జీవన్ రెడ్డి కుటుంబ సమస్యల వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక పోలీస్ అయ్యుండి, సమస్యలను పరిష్కరించాల్సిన వ్యక్తే, తన సమస్యల ముందు ఓడిపోవడం అందరినీ కలిచి వేస్తోంది.
పెరుగుతున్న కుటుంబ కలహాలు..
జీవన్ రెడ్డి ఆత్మహత్య ఘటన కేవలం ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు.. ఈ రోజుల్లో పెరుగుతున్న కుటుంబ కలహాలు, వాటి పర్యవసానాల గురించి సమాజానికి ఇస్తున్న గట్టి హెచ్చరిక లాంటిది. భార్యాభర్తల మధ్యనో, ఇంట్లో ఇతర సభ్యుల మధ్యనో వచ్చే అర్థం లేని గొడవల వల్ల, ఉన్నత జీవితాలు బలి కావాల్సి వస్తోంది. జీవన్ రెడ్డి లాంటి కానిస్టేబుల్ కూడా కుటుంబ సమస్యల ముందు తలవంచి.. ఈ ఘోర నిర్ణయం తీసుకోవడం, ఉద్యోగ ఒత్తిడి , వ్యక్తిగత ఒత్తిడి మధ్య సరైన సమన్వయం లేకపోవడాన్ని స్పష్టం చేస్తోంది.
