BB6 TELUGU NEWS CHANNEL
సంగారెడ్డి జిల్లాలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నారాయణఖేడ్ నియోజకవర్గం, కల్హేర్కు చెందిన ఆయన తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సందీప్ సంగారెడ్డి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి.. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. నారాయణఖేడ్ నియోజకవర్గం, కల్హేర్కు చెందిన సందీప్.. గత ఒక సంవత్సరం నుంచి సంగారెడ్డి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
అయితే.. ఈ ఆత్మహత్యకు సంబంధించిన ప్రధాన అనుమానం ఒకటి వెలుగులోకి వచ్చింది. సందీప్ ఆన్లైన్ గేమ్లకు బానిసై.. ఆ క్రమంలో భారీగా డబ్బులు పోగొట్టుకోవడం వల్లే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుని ఉంటాడని స్థానిక వర్గాలు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా ఆర్ధికంగా నష్టపోయి.. ఆ ఇబ్బందులను తట్టుకోలేకనే అతను తన వద్ద ఉన్న తుపాకీని ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే రూరల్ పోలీసులు సమాచారం అందుకుని.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరణానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కేసు వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కేవలం వారం రోజుల క్రితమే.. కామారెడ్డిలో కూడా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జీవన్రెడ్డి, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా వరుసగా కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడటం అనేది తెలంగాణ పోలీసు శాఖలో నెలకొన్న తీవ్రమైన మానసిక ఒత్తిడిని స్పష్టం చేస్తోంది. నిబంధనలు, క్రమశిక్షణ గురించి ప్రజలకు చెప్పే పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం అనేది ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. శాంతిభద్రతలను కాపాడే సిబ్బంది తమ సొంత సమస్యలను పరిష్కరించుకోలేక, బలవన్మరణాలకు పాల్పడితే.. సాధారణ ప్రజలు ప్రభుత్వ వ్యవస్థల పట్ల, పోలీసుల పట్ల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. పోలీసు శాఖలో ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
రివాల్వర్తో కాల్చుకొని..సంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య..
04
Nov