BB6 TELUGU NEWS CHANNEL
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఎస్టీ,ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించుకుండా చూసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. రిజర్వేషన్ల ఖరారు కోసం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శనివారం ‘జీవోనం. 46’ ద్వారా సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు తగ్గట్టు రూపొందించిన ఈ గైడ్లైన్స్ ఆధారంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన జీవో నంబర్ 42ను రద్దు చేసింది. కొత్తగా ఇచ్చిన జీవో 46 ప్రకారం..ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి సర్పంచ్ రిజర్వేషన్లను ఎస్టీ, ఎస్సీలకు 2011జనాభా లెక్కల ప్రకారం.. బీసీలకు’కులగణన సర్వే-2024′ ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. వార్డు మెంబర్ల విషయంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల కోసం ‘కులగణన (ఎస్ఈఈఈపీసీ)సర్వే-2024’ జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎస్టీ, ఎస్సీ,బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ |పద్ధతిలో అమలు చేయాలి.
ప్రతి కేటగిరీలో (ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్)సగం సీట్లు మహిళలకు కేటాయించాలి.గత ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్ అయిన వార్డులు లేదా పంచాయతీలు.. ఈ సారి సాధ్యమైనంత వరకు మహిళలకు కేటాయించరాదు. ఈ నాలుగు వర్గాలకు 50 శాతం పరిమితిలోపు రిజర్వేషన్లు పోగా.. మిగిలిన స్థానాలన్నీ జనరల్ స్థానాలుగా ప్రకటించనున్నారు.
సర్పంచ్లకు ఆర్డీవోలు.. వార్డులకు ఎంపీడీవోలు..సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేసే బాధ్యతలను ఆర్డీవోలకు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా ఖరారు చేయనున్నారు.
షెడ్యూల్డ్ ఏరియాల్లో (ఏజెన్సీ) మాత్రం నిబంధనలు భిన్నంగా ఉంటాయి.100శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ తో పాటు వార్డులన్నీ ఎస్టీలకే రిజర్వ్ కానున్నాయి. అక్కడ ఇతర సామాజిక వర్గాలకు పోటీ చేసే అవకాశం లేదు. మొదట జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు (ఎస్టీ, ఎస్సీ, బీసీ) రిజర్వేషన్లు కేటాయించి, వాటిని అవరోహణ క్రమంలో లిస్ట్ తయారు చేస్తారు.గతంలో రిజర్వ్ అయిన సీట్లను తీసేసి,మిగిలిన వాటిలో అత్యధిక జనాభా ఉన్నవాటికి రిజర్వేషన్లు కల్పిస్తారు. ఆతర్వాత మిగిలిన సీట్లను అన్ రిజర్వ్ కింద ప్రకటిస్తారు. చివరిగా లాటరీ ద్వారా మహిళా కోటాను ఫిక్స్ చేస్తారు. కాగా,వివిధ కారణాల వల్ల 2019 ఎన్నికల్లో అమలుకాలేని రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించవచ్చు. అంతేకాదు, 2019తర్వాత కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలు, వార్డులకు మాత్రం ఇవే ఫస్ట్ ఎలక్షన్స్ కింద లెక్కలోకి తీసుకుంటారు.
ఓటరు జాబితాలు రెడీ..గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. గతంలో ప్రచురించిన జాబితాలోని లోపాలను ఎన్నికల సంఘం సూచన మేరకు సరిదిద్దారు. ఓటర్లు ఒక వార్డు నుంచి మరోవార్డుకు మారడం, మ్యాపింగ్లో తప్పులు వంటి వాటిని సరిచేశారు. శనివారం ఓటరు జాబితా సవరణపై వచ్చిన అభ్యంతరాలను డీపీఓలు పరిష్కరించారు..ఈ మేరకు వార్డుల వారీగా మార్పులతో కూడిన ఫైనల్ ఫొటో ఓటర్ల జాబితా రెడీ చేశారు. ఆదివారం గ్రామాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించేందుకు ఏర్పాట్లు చేశారు.
రేపటిలోగా గెజిట్లు పంపించాలి జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల గెజిట్ కాపీలను వెంటనే తమకు సమర్పించాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన శనివారం మెమో జారీ చేశారు. జీవో ఎంఎస్ నంబర్ 46 ప్రకారం ఖరారు చేసిన రిజర్వేషన్ల జిల్లా గెజిట్ కాపీలను (ఇంక్ సైన్ చేసినవి) మూడు సెట్ల చొప్పున సిద్ధం చేయాలని ఆదేశించారు. స్కాన్ చేసిన కాపీలను పెన్డ్రైవ్ లో వేసుకుని హైదరాబాద్ రావాలని సూచించారు. సోమవారం ఉదయం 10 కార్యాలయంలో వీటిని అందజేయాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రక్రియ పూర్తయిన జిల్లాలవారు 23వ తేదీనే సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఆయా జిల్లాల పంచాయతీ ఆఫీసర్లు (డీపీఓలు) స్వయంగా వచ్చి ఈ కాపీలను అందజేయాలని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, జిల్లాల నుంచి వచ్చిన గెజిట్లను పరిశీలించడంతో పాటు వాటిని తీసుకోవడానికి పీఆర్ కమిషనరేట్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.ఆదివారం కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు.
1,12,474 పోలింగ్ స్టేషన్లు రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లోఎన్నికలు నిర్వహించనుండగా..రాష్ట్ర వ్యాప్తంగా 1,12,474 పోలింగ్ స్టేషన్లు,15,522 పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. ప్రస్తుతం గ్రామీణ ఓటర్లు16,703,173 ఓటర్ల ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు81,65,899 మంది,మహిళా ఓటర్లు 85,36, 770 మంది ఉండగా.. ఇతరులు 504 మంది ఓటర్లుఉన్నారు.
జీవో 46 విశేషాలు..
•ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు.
•సర్పంచ్ రిజర్వేషన్లను ఎస్టీ,ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం..బీసీలకు ‘కులగణన సర్వే-2024’ప్రకారం కేటాయించాలి.
•వార్డు మెంబర్ రిజర్వేషన్లకు ఎస్టీ,ఎస్సీ, బీసీలకు కులగణన సర్వే-2024ను ప్రామాణికంగా తీసుకోవాలి.ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలి. గతంలో వచ్చిన రిజర్వేషన్లు ఈసారి కేటాయించరాదు.ప్రతి కేటగిరీలో (ఎస్సీ, ఎస్టీ, బీసీ,జనరల్) సగం సీట్లు మహిళలకు
కేటాయించాలి.
•మహిళా రిజర్వేషన్లను రాజకీయపార్టీల సమక్షంలో లాటరీ ద్వారా ఖరారు చేయాలి.
100 శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ తో పాటు వార్డులన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయాలి.మొదట జనాభా ప్రాతి పదికన ఎస్టీ,ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించి, అవరోహణ క్రమంలో పంచాయతీల లిస్ట్ తయారు చేయాలి. అందులోంచి గతంలో రిజర్వ్ అయిన స్థానాలను తీసేసి, మిగిలిన వాటితో లిస్టు తయారుచేయాలి.చివరిగా లాటరీద్వారా మహిళా కోటాను ఫిక్స్ చేయాలి.
పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు.. 50% మించకుండా అమలు..!
23
Nov